విశాఖపట్నం జిల్లా పోలీసులు మరోసారి మానవత్వం చాటుకున్నారు.

 


పోలీసులు మానవత్వం చాటుకున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అర్థం చెప్పేలా వ్యవహరించారు. ఇప్పటికే తమ మంచితనంతో ఉన్నతాధికారులు, ప్రజలతో శభాష్ అనిపించుకుంటున్న ఏపీ పోలీసులు.. మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఓ అనాథ శవాన్ని కనీసం చూసేందుకు కూడా ఎవరూ ముందుకు రాని తరుణంలో.. ఆ మృతదేహాన్ని భుజంపై వేసుకుని 3 కిలో మీటర్లు నడుచుకుంటూ మోసుకెళ్లారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం సీతంపాలెం సముద్ర తీరానికి ఓ అనాథ శవం కొట్టుకొచ్చింది. అయితే, ఆ శవం పూర్తిగా కుళ్లిపోయి, గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో దాన్ని తీసుకుపోవడానికి సిబ్బంది వెనుకంజ వేసింది. సాయం చేసేందుకు స్థానికులు కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రాంబిల్లి పోలీసులు వెంటనే స్పందించారు. అనాథ శవాన్ని భుజాన వేసుకుని సుమారు 3 కిలో మీటర్ల వరకు నడిచారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.